Thursday, January 27, 2011

ప్రభుత్వంపై విశ్వాసాన్ని నిరూపించుకోండి

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దమ్ముంటే తన ప్రభుత్వంపై విశ్వాసాన్ని నిరూపించుకోవాలని, తాము మాత్రం పదవులకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని జగన్‌ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సవాల్‌ విసిరారు. తమ రాజీనామా కోరడానికి ముందు ముఖ్యమంత్రితో సహా వైఎస్సార్‌ ఫోటో పెట్టుకుని గెలిచిన ప్రతిఒక్కరూ కూడా రాజీనామా చేసి తిరిగి గెలవాలని అన్నారు. వైఎస్‌ ఫోటో లేకుండా తాము స్వతంత్రంగా, సొంతంగా గెలిచామనే ధైర్యముంటే విశ్వాసాన్ని నిరూపించుకోవాలని చెప్పారు.శాసనసభా మీడియాపాయింట్‌లో బుధవారం సాయంత్రం జగన్‌ మద్దతుదారులు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, బాబురావు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ విలేఖరులతో మాట్లాడారు. గడిచిన కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, దివంగత నేత వైఎస్‌, ఆయన కుమారునిపై నీచాతినీచమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తమతోపాటు లక్షలాది మంది వైఎస్‌ అభిమానులకు బాధ కలిగిస్తుందని పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ చెప్పారు. మాజీ ప్రధాని పివి నర్సింహారావును కలుసుకోవడానికి వైఎస్సార్‌కు తానే అపాయింట్‌మెంట్‌ ఇప్పించానని, అప్పుడు వైఎస్‌ అనైతిక పని అడిగితే నిరాకరించానని ముఖ్యమంత్రి చెప్పడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ అనేకసార్లు ప్రజలచేత పార్లమెంటుకు, శాసనసభకు ఎన్నికైన వైఎస్‌కు అన్ని పార్టీలకు చెందిన జాతీయ నాయకులతో కూడా సత్సంబంధాలు ఉండేవని ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన కార్యక్రమాలు, అమలుపరిచిన పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టలేదని, వాటివల్ల దేశవ్యాప్తంగా ఆయన పరపతి పెరిగిందని వారు వివరించారు. తన రాజకీయ జీవితంలో కనీసం మంత్రిగా కాలేని కిరణ్‌కుమార్‌రెడ్డిని చీఫ్‌ విప్‌గా, ఆ తర్వాత స్పీకర్‌గా వైఎస్సే నియమించారని, అలాంటి వైఎస్‌ నైతికమైన పని చేయడానికి ఏముంటుందని వారు అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్‌ పార్టీని 2004, 2009లో అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు వైఎసేనని, ఆయన చేపట్టిన పథకాల వల్లనే రెండవసారి అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు గెలిచిన వారందరూ కూడా ఆనాడు ఆయన ఫోటో పెట్టుకుని గెలిచారని ఇప్పటికీ ప్రతి సభలు, సమావేశాలలో వైఎస్సార్‌ ప్రస్తావన లేకుండా మాట్లాడలేకపోతున్నారని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ గుర్తుచేశారు. వైఎస్‌ తనయుడు జగన్‌ పార్టీకి, పదవికి రాజీనామా చేయకముందే తన మంత్రివర్గంలో చేరాలని, ప్రజారాజ్యం పార్టీతో అనైతికంగా చర్చలు జరిపిన ముఖ్యమంత్రి ఈ రోజు జగన్‌పై కూడా లేనిపోని మాటలు అంటూ నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారని వారు ధ్వజమెత్తారు.పార్టీ నుంచి బయటకువచ్చి ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న జగన్‌ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ చెమటోడ్చి తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని 2014లోగా అస్థిరపర్చడం, లేదా పడగొట్టడం జరగదని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పునరుద్ఘాటించారు. మాకు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ అనవసరంగా రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ గుర్తు, వైఎస్సార్‌ కష్టార్జితం వల్లనే ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిందని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠాన వర్గానికి, జగన్‌కు మధ్య సయోధ చర్చలు జరుగుతున్నాయని అనకాపల్లి సబ్బంహరి చెప్పిన మాటలతో తాము ఏకీభవించడం లేదని అన్నారు.


 

Sunday, January 23, 2011

అది రొచ్చుబండ.. బహిష్కరించండి: కేసీఆర్

“తెలంగాణ ఉద్యమం నుంచి దృష్టిని మరల్చడానికే రచ్చబండ అనే రొచ్చు కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. దానిని బహిష్కరించండి. ఈ కార్యక్రమానికి వచ్చే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను తరిమికొట్టండి” అని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. రచ్చబండ కార్యక్రమాన్ని జరగకుండా చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చెంప చెళ్ళుమనిపించాలని, ఉద్యమ తీవ్రతను ఢిల్లీకి తెలియజేయాలని స్పష్టం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) ‘తెలంగాణ వర్తమాన ఉద్యమం-మన కర్తవ్యం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో ఆయన మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిట్ల దండకం అందుకున్నారు. తెలంగాణ ఉద్యమం చల్లబడిందనే ప్రచారాన్ని తోసిపుచ్చారు. “తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇప్పటికే పదేళ్ళు కొట్లాడాం. రాష్ట్ర సాధనకు మరో పదేళ్ళు కొట్లాడతాం” అని ప్రకటించారు. ప్రజలశక్తి ముందు ఏ శక్తీ నిలవదని చెప్పారు. “తెలంగాణపై వలస వాదులు, ఢిల్లీ పెద్దలు కన్‌ఫ్యూజ్.. గోల్‌మాల్ చేస్తరు. కానీ మేం కాము. ఎంత ఒత్తిడి ఉన్నా ఈ ఉద్యమం ఆగిపోయేది.. ఆరిపోయేది కాదు. ఆగిపోయేదైతే పదేళ్లుగా ఉద్యమం ఉండేది కాదు. ఉద్యమం యాడ చల్లపడ్డది?.. తన్నుకునుడు.. గుద్దుకునుడు.. కాల్చుకొని సచ్చిపోవుడు.. అదే ఉద్యమమా? ఈరోజు 10 వేల గ్రామాల్లో లక్షలాదిమంది ప్రజలు దీక్షలు చేస్తున్నారు. ఎందుకు లొల్లి అని మంచిగ ఉద్యమం చేస్తున్నం. ఈ మతలబు పారలేదంటే కోదండరాం ఒక్కటే పిలుపు ఇస్తడు. అయినా, ఉద్యమం చల్లబడిందని ఉట్టిగనే చెబుత లేరు.. అన్నీ తెలిసే అట్లంటాన్రు. హింస లేకుండా ఉద్యమిస్తుంటే చల్లబడిందనడం కూడా కుట్రే. అదే హింస జరిగితే.. విద్యార్థులు అలజడి సృష్టిస్తే.. కోదండరాం తాలిబన్లను తయారు చేసిండని అంటరు. శాంతంగా ఉద్యమం చేస్తే ఏమీ లేదంటారు” అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం క్యారెక్టర్ మార్చుకొని.. వ్యూహాత్మక పంథాలో ముందుకు వెళుతోందని కేసీఆర్ చెప్పారు.

ఉద్యమాన్ని అంచెలంచెలుగా ఉధృతం చేస్తాం : ప్రొఫెసర్‌ కోదండరాం


కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టి ఇచ్చిన మాటను నిలుపుకోవాలని తెలంగాణ రాజకీయ జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక రిలే నిరాహారదీక్షా శిబిరాలను ఏర్పాటు చేశారు. కోదండరామ్‌ కూకట్‌పల్లిలో దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు.
వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ అన్ని ప్రాంతాల్లో జెఎసి నాయకత్వంలో రిలే నిరాహారదీక్షా శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలుపుకోవాలని, దీని కోసం అంచెలంచెలుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కోదండరామ్‌ స్పష్టం చేశారు.
దేశానికి స్వాతంత్య్రం అహింసాయుత పోరాటాల ద్వారానే సిద్ధించిందనీ, అదే పద్దతిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని కోదండరాం అన్నారు. ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయడం ద్వారా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ వచ్చే వరకూ ఈ రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో ఉందనీ, ఇందుకోసం ఆ పార్టీపై తమ ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే, తెలుగుదేశం పార్టీ కూడా ఉద్యమంలో తమతో కలసి రావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ప్రతి పల్లెలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలనీ, నాలుగున్నర కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నందున ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆయన ఆకాంక్షించారు.
పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం ప్రజాప్రతినిధులు, పాలకులపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం నగరంలోని బోడుప్పల్‌, సికింద్రాబాద్‌, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షా శిబిరాలను సందర్శించి దీక్షా శిబిరాలలో పాల్గొన్న పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులకు సంఘీభావం ప్రకటించారు.

Saturday, January 22, 2011

సూరితో బంధుత్వం మాత్రమే: శ్వేతారెడ్డి

హైదరాబాద్‌: మద్దెలచెర్వు సూరితో గల సంబంధాలపై తనపై వచ్చిన వార్తలను టీవీ చానెల్ యాంకర్ శ్వేతా రెడ్డి ఖండించారు. తాను సూరికి గానీ భాను కిరణ్‌కు గానీ బినామీగా వ్యవహరించలేదని, తన పేరు మీద విధమైన ఆస్తులు కూడా లేవని ఆమె స్పష్టం చేశారు. తన పేరు మీద వివిధ సంస్థల్లో సూరి, భాను కిరణ్ పెట్టుబడులు పెట్టినట్లు వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించారు. తాను తనకు వచ్చే జీతంపై ఆధారపడి జీవిస్తున్నట్లు ఆమె తెలిపారు. తనను పోలీసులు విచారించిన మాట వాస్తవమేనని, భాను కిరణ్‌తో తనకు ప్రాణహాని ఉందని సూరి మీతో చెప్పాడా అనేదే పోలీసులు ప్రధానంగా అడిగిన ప్రశ్న అని ఆమె చెప్పారు. ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధి ఆమెను ఇంటర్వ్యూ చేశారు. సూరి తమ ఇంటికి వచ్చేవారని, తమకు బంధుత్వం ఉందని, బంధుత్వం ఉండడమే తన కర్మ అని ఆమె అన్నారు. భాను కిరణ్ తనకు తెలియదని, సూరితో వాసుదేవ రెడ్డి తమ ఇంటికి వచ్చేవాడని ఆమె చెప్పారు. సూరి తరుచుగా తనతో మాట్లాడేవాడని, వార్తలు ఏమున్నాయని అప్పుడప్పుడు ఫోనులో అడిగేవాడని ఆమె చెప్పారు.తన వ్యవహారాల గురించి సూరి తనతో మాట్లాడేవాడు కాదని, తాను కూడా అడిగేదాన్నికానని ఆమె అన్నారు. భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే సూరిని మానవీయ కోణంలో తాను ఇంటర్వ్యూ చేసి ప్రెజెంట్ చేశానని, తమ ఎన్టీవి యాజమాన్యం అంగీకరించకపోతే తాను ఇంటర్వ్యూ చేసి ఉండేదాన్ని కాదని, అందులో సూరికి ఫేవర్ చేసే విషయమేదీ లేదని ఆమె అన్నారు. తన సోదరుడి మరణం గురించి సూరికి తెలుసునని, అయితే అవన్నీ మరిచిపోయి ప్రశాంతంగా జీవించాలని చెప్తుండేవాడని ఆమె అన్నారు. తానో హీరోను ప్రేమించినట్లు, అతన్ని సూరి ముఠాతో కొట్టించినట్లు వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించారు. మీడియా తనపై ఇష్టం వచ్చినట్లు రాస్తున్నాయని, అలా వార్తలు ఇచ్చిన మీడియాపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె అన్నారు.తనకు ఆత్మస్థయిర్యం ఉందని, పోరాటం చేస్తానని ఆమె చెప్పారు. భాను కిరణ్ గురించి సూరి తనతో ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు.

నివేదికపై మొదటిసారి నోరు విప్పిన సీఎం

న్యూఢిల్లీ‌: శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన నివేదికపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మొదటిసారి మాట్లాడారు. అంశాన్ని ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోందని తెలిపారు. పార్టీ విధానంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న వెంటనే వెల్లడిస్తామని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కాంగ్రెస్‌ నిర్ణయం కేంద్రం నిర్ణయానికి భిన్నంగా ఉన్నా, వీలైనంత త్వరగా బహిర్గతం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలన్నింటినీ సమానంగా అభివృద్ధి చేయాలన్నదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. కిరణ్‌ కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. తర్వాత ప్రధాని మన్మోహన్‌, కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ తోనూ సమావేశమయ్యారు. తర్వాత కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా మాట్లాడారు. పార్టీ ముఖ్యనేత ప్రణబ్‌ ముఖర్జీతో, మరో సీనియర్‌ నేత ఏకే ఆంటోనీతో భేటీ అయ్యారు. సీఎం శనివారం సోనియాతో సమావేశమయ్యే అవకాశముంది. సమావేశాల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదిక చుట్టూనే చర్చ సాగింది. నివేదిక బహిర్గతమైన నాటినుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పార్టీల స్పందనలపై తమ పార్టీ పెద్దలకు ముఖ్యమంత్రి నివేదించినట్లు తెలిసింది.

ధరలను నియంత్రించే వరకూ పోరాటం ఆగదు

నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ చంద్రబాబు సికింద్రాబాద్ మోండా మార్కెట్ చంద్రబాబు నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభించారు. అనంతరం ఆయన ఆర్‌పీ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద వినియోగదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మార్కెట్ లోని వ్యాపారులు, వినియోగదారులతో మాట్లాడుతూ పెరిగిన ధరలతో పేదలు నిత్యావసర వస్తువులు కొనలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీగా వెళ్లి ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేవరకూ పోరాడతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లే ధరలు పెరుగుతున్నాయని అన్నారు. పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై టీడీపీ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది.

Sunday, January 16, 2011

ఇప్పుడు అవిశ్వాసం అంటే చాలు.. కిరణ్ సర్కార్ మటాష్..!!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హస్తినలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన 24 గంటల జలదీక్ష కాంగ్రెస్ హైకమాండ్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఎందుకంటే... ఆయన చేపట్టిన 24 గంటల జలదీక్ష "సాక్షి"గా అధికార పార్టీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు జగన్ వెంట కూచున్నారు. ఈ పరిణామంతో కిరణ్ సర్కార్ పతనం అంచుకెళ్లిపోయిందన్న వాదనలు ఊపందుకున్నాయి. జగన్ వెంట ఆ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లకుండా చేసేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ డీఎస్ రంగంలోకి దిగి బుజ్జగింపులు, భయపెట్టడాలు చేసినా వారు ఖాతరు చేయలేదు. పైపెచ్చు దీక్షా వేదికపై నుంచి దమ్ముంటే తమపై చర్య తీసుకోండి అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరిపై అధిష్టానం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ హుటాహుటిన హైదరాబాదుకు చేరుకుని సీఎం, పీసీసీ చీఫ్‌తో అత్యవసరంగా సమావేశమయ్యారు. సమావేశానంతరం ఆయన  మాట్లాడుతూ... 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులను ఎలా అధిగమించాలో తెలుసునని చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే జగన్ వెంట 24 మంది ఎమ్మెల్యేలు బాహాటంగా నడుస్తుండటంతో కిరణ్ సర్కార్ మైనార్టీలో పడిపోయినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా తనతో ఉన్న ఎమ్మెల్యేలంతా 2014లో జరుగబోయే ఎన్నికల్లో తన పార్టీ తరపున పోటీ చేస్తారని వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించడంతో ఇక కిరణ్ సర్కార్ పని అయిపోనట్లేనని వారు వాదిస్తున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీలో సీఎం తన బలాన్ని నిరూపించుకోవాలంటూ గవర్నర్‌కు ఏ చిన్న పార్టీ లేఖ రాసినా కిరణ్ సర్కార్ కష్టాలు తప్పవు. అయినా ప్రభుత్వాన్ని నడిపేందుకు సహకరించే సభ్యులే తిరిగి సొంత పార్టీని తూర్పారబట్టడం చిత్రమే. ఇలా తూర్పారబడుతున్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ గుడ్లప్పగించి చూస్తూ ఉండటం మరీ మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం జగన్ దయతో ప్రభుత్వం నడవడం లేదనీ, ఒకవేళ తనకు అంత బలం ఉంటే ప్రభుత్వాన్ని కూలగొట్టి మాట్లాడాలని సవాల్ విసిరారు. ఈ విషయం ఇలా ఉంటే తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణా సాధనకోసం తమ పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలు సన్నద్ధమవుతున్నారు. వారు కనుక ఆ పని చేస్తే కేంద్రంలో యూపీఎ సర్కార్‌కు కష్టాలు తప్పవు. మొత్తమ్మీద అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోని ప్రభుత్వాలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలతోనే ఆయువు తీరే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి మార్గాన్ని అనుసరిస్తుందో చూడాలి.

Monday, January 10, 2011

లాగులు ఊడగొట్టి పంపించే రోజు దగ్గర్లోనే ఉంది: తెరాస

తెలంగాణ ప్రాంతంలోని సమైక్యవాదుల లాగులు ఊడగొట్టి తరిమే సమయం అతి దగ్గర్లోనే ఉందని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతలు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మరుక్షణం ఇది జరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలు నాయిని నర్శింహా రెడ్డి, చంద్రశేఖర్ జోస్యం చెప్పారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోందని వారు ఆరోపించారు.

తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ల ముట్టడి జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నేత నాయిని నర్సింసింహా రెడ్డి, చంద్రశేఖర్‌లు ప్రసంగిస్తూ తెలంగాణలోని పోలీసు బలగాలను చూస్తుంటే రాష్ట్రపతి పాలనను తలపిస్తోందన్నారు. అందువల్ల కొత్తగా రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారని గుర్తు చేశారు.

రాష్ట్ర పాలనా పగ్గాలు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి చేతిలో లేవని గవర్నర్ నరసింహన్ వద్ద ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ తీరు తెలంగాణకు అవమానంగా ఉందన్నారు. అనంతరం తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ఇప్పటికైనా వారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించాలన్నారు. కాంగ్రెస్, తెదేపాలు తెలంగాణపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలన్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి మెత్తబడిందన్న వార్తలను మాజీ మంత్రి, తెరాస సీనియర్ నేత సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ తోసిపుచ్చారు. సమైక్యవాదుల లాగులు ఊడగొట్టి వారిని పంపించే రోజు అతి దగ్గర్లోనే ఉందన్నారు. తెలంగాణ తెలుగుదేశం నేతలుకు సిగ్గు ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమించాలన్నారు. 

తెలంగాణపై కేసీఆర్‌వి కల్లిబొల్లి కారుకూతలేనా?!!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖర్ రావుకు చిత్తశుద్ధిలేదా.? రాష్ట్ర ఏర్పాటుపై గత యేడాది కాలంగా చేసిన వ్యాఖ్యలన్నీ కల్లిబొల్లి కారుకూతలేనా అనే సందేహం తలెత్తుతోంది. ప్రస్తుతం పది నెలల పాటు రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసి జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తుది నివేదిక సమైక్యానికే తొలి ఓటు అంటూ వెల్లడించింది. ఈ నివేదిక అంశాన్ని పక్కన పెడితే కేసీఆర్ నిన్నమొన్నటి వరకు చెప్పిన.. చేసిన మాటలు, ప్రగల్భాలు ఏమయ్యాయనే ధర్మసందేహం ఇపుడు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎప్పుడో తెలంగాణ ఇచ్చేశారని, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడే దానికి అడ్డుపడ్డారంటూ డిసెంబరు 31వ తేదీ ముందు వరకూ బాబుపై కేసీఆర్ నిప్పులు కురిపించారు. ఇపుడు సడన్‌గా  తన బాణీని మార్చుకున్నారు. కాంగ్రెస్‌పై కత్తులు కారాలు నూరడం ఆరంభించారు. ఈ నేపథ్యంలో అసలు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారా? లేదా?. 2009 డిసెంబరు 9వ తేదీన కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన తాను చెప్పినట్లుగానే వచ్చిందని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు ఆ మాటలను ఎందుకు ప్రస్తావించడం లేదు. అంతేకాకుండా, వచ్చే యేడాది దసరా ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటామని కేసీఆర్‌ ప్రజల్లో ఆశలురేకెత్తించారు. ఒకానొక సమయంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా తన భుజస్కంధాలపై ఉందంటూ ఢిల్లీలో సంచలనాత్మక ప్రకటన చేశారు. ఆ రకంగా తెలంగాణకు ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమే అడ్డంకి తప్ప, సోనియా గాంధీ సుముఖంగానే ఉన్నారన్న ప్రచారాన్ని తెలంగాణ ప్రజల్లో కల్పించారు. ఇలా చేయడం వల్ల తెలంగాణ కోర్టు బోనులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా నిలబెట్టడంలో సఫలీకృతులయ్యారు. అయితే, ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాలు, జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తుది నివేదికతో తనను తాను కాపాడుకునేందుకు ఆత్మరక్షణ ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్‌ను దుయ్యబట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇది అటు కేసీఆర్‌తో పాటు.. తెరాసకు రాజకీయంగా, ఎత్తుగడపరంగా నష్టం కలిగించే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది పార్టీ భవిష్యత్తుకు విఘాతం కలిగించేదేనన్నారు. ప్రధానంగా నిమ్స్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న సందర్భంగా గత డిసెంబర్‌ 9న చిదంబరం చేసిన ప్రకటన వెనుక తానే ఉన్నానని, తాను చెప్పినట్లుగానే చిదంబరం ప్రకటన చేశారని చాలా నెలల తర్వాత గొప్పగా కేసీఆర్‌ చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌, హోంమంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. వాటి వివరాలు నేటికీ "చిదంబర రహస్యం"గానే ఉండిపోయాయి. ఆ తర్వాత కూడా సోనియా తెలంగాణ ఎప్పుడో ఇచ్చేసిందని, చంద్రబాబునాయుడే దానికి అడ్డుపడి, సీమాంధ్రలో అన్ని పార్టీలను ప్రోత్సహించి ఉద్యమానికి ఊపిరి పోశారంటూ కేసీఆర్‌ నిన్న మొన్నటి వరకూ ధ్వజమెత్తారు. ఇపుడు జస్టీస్ శ్రీకృష్ణ నివేదిక సమైక్యవాదానికే మొగ్గు చూపడంతో కేసీఆర్‌ ఇప్పటివరకూ చెప్పినవి, చేసిన ప్రకటనలలో అణు మాత్రం విశ్వసనీయత లేదన్న విషయం తేటతెల్లమైంది. కేవలం చంద్రబాబు నాయుడును తెలంగాణలో భ్రష్టుపట్టించేందుకే కేసీఆర్ ఒక పథకం ప్రకారం "బాబు ఒక్కడే తెలంగాణకు అడ్డంకి" అన్న ప్రచారానికి తెరలేపారన్న అనుమానాలు బలపడుతున్నాయి. పైపెచ్చు.. తాజా పరిణామాలతో ఆత్మరక్షణలో పడిన కేసీఆర్‌ హఠాత్తుగా గళం మార్చి మళ్లీ కాంగ్రెస్‌ను తూర్పారపట్టడం సొంత పార్టీ నేతలు సైతం జీర్ణించుకోలేకే పోతున్నారు. నాడు సోనియా తెలంగాణను ఎప్పుడో ఇచ్చిందన్న ఆయనే, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ను తిట్టిపోయడంతో తమ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదని తెరాస శ్రేణులు అభిప్రాయపడటమే కాకుండా, కేసీఆర్‌వి కల్లిబొల్లి గాలి కబుర్లుగా మారాయని తెదేపా నేతలు దుయ్యబడుతున్నారు.

Friday, January 7, 2011

ఉపాధి కోల్పోయిన డీలర్లు

తమను పక్కకు పెట్టాలని ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నదని చౌకధరల డీలర్లు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటివరకు తాము దీనితోనే ఉపాధి పొందుతున్నామని, ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయ  అవకాశాన్ని కల్పించలేకపోవడం తమకెంతో నష్టాన్ని కల్గిస్తుందని ఈ జిల్లాలో పనిచేస్తున్న చౌకధరల డీలర్లు కలవరపడుతున్నారు. అయితే ఈ దుకాణాల బాధ్యతలను ఐ కే పి మహిళలకు ఇవ్వనున్నామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏకపక్ష నిర్ణయంగా కనిపిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐకేపి మహిళలు మాత్రమే విధులు సరిగా నిర్వహిస్తున్నట్లు ఈ సర్కార్ భావించింది అనే అభిప్రాయాన్ని కొందరు వెలిబుచ్చారు. ఇదిలా ఉంటే గతాన్ని ఒకసారి పరిశీలిస్తే ఉపాధి హామీ పనుల్లో పెద్దమొత్తంలో చేసిన అవినీతి ఊసే ఎత్తకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని చూపిస్తోంది. అయితే తమను పక్కనబెట్టి మాకు ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని చూపించకపోవడం
ఏం న్యాయమని డీలర్లు ప్రభుత్వాదికారుల్ని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మరి ఇప్పుడైనా వారు సరిగా బాధ్యతలు నిర్వర్తిస్తారా అంటే నమ్మకం లేదంటున్నారు ప్రజలు. అవినీతి రుచిమరిగిన వీరు ఇక ఎలా పనులు చేస్తారో ప్రజల మెప్పు ఎలా పొందుతారో చూడాల్సిందే!

Thursday, January 6, 2011

సంతృప్తి పరచని శ్రీకృష్ణ నివేదిక

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలు బహిర్గతమైన వెంటనే తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీల ముఖాల్లో నెత్తుటిచుక్క లేకుండా పోయింది. పూర్తిగా నిర్వేదం నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్యాంధ్రగా కొనసాగింపే ఉత్తమ పరిష్కారమని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నిర్ధారించింది. ఇది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. అదేసమయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించే దమ్మూధైర్యం ఏ ఒక్కరికీ లేదు. కమిటీ సూచించిన విధంగా తెలంగాణకు రాజ్యంగ, చట్టబద్ధమైన హక్కులు కల్పించడం అసాధ్యమని వారు వ్యాఖ్యానించారు. నివేదిక బహిర్గతమైన అనంతరం ఎంపీలందరూ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో సమావేశమయ్యారు. డిసెంబర్‌ 9 న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండేలా కేంద్రం, పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని జైపాల్‌ను కోరారు. అంతేకాకుండా ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సారధ్య బాధ్యతలను సీనియర్ నేత జైపాల్ రెడ్డే స్వీకరించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఈప్రాంతవారికి సంతృప్తినివ్వలేదని తమ మనోభావాలను కించపరిచేలా ఉన్న ఈ నివేదికను తాము తిరస్కరిస్తున్నామని తెలంగాణ ఎంపీలందరూ స్పష్టం చేశారు. యథాతథ స్థితిని కొనసాగించడం అసంభవమన్నారు. రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కులతో సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యంకాదని పేర్కొన్నారు. ఇప్పటికే పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం అమలు పూర్తిగా విఫలమయ్యాయని వారు గుర్తు చేశారు. అందువల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే శాశ్వత పరిష్కారమని వారు ముక్తకంఠంతో వ్యాఖ్యానించారు.