Saturday, January 22, 2011

సూరితో బంధుత్వం మాత్రమే: శ్వేతారెడ్డి

హైదరాబాద్‌: మద్దెలచెర్వు సూరితో గల సంబంధాలపై తనపై వచ్చిన వార్తలను టీవీ చానెల్ యాంకర్ శ్వేతా రెడ్డి ఖండించారు. తాను సూరికి గానీ భాను కిరణ్‌కు గానీ బినామీగా వ్యవహరించలేదని, తన పేరు మీద విధమైన ఆస్తులు కూడా లేవని ఆమె స్పష్టం చేశారు. తన పేరు మీద వివిధ సంస్థల్లో సూరి, భాను కిరణ్ పెట్టుబడులు పెట్టినట్లు వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించారు. తాను తనకు వచ్చే జీతంపై ఆధారపడి జీవిస్తున్నట్లు ఆమె తెలిపారు. తనను పోలీసులు విచారించిన మాట వాస్తవమేనని, భాను కిరణ్‌తో తనకు ప్రాణహాని ఉందని సూరి మీతో చెప్పాడా అనేదే పోలీసులు ప్రధానంగా అడిగిన ప్రశ్న అని ఆమె చెప్పారు. ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధి ఆమెను ఇంటర్వ్యూ చేశారు. సూరి తమ ఇంటికి వచ్చేవారని, తమకు బంధుత్వం ఉందని, బంధుత్వం ఉండడమే తన కర్మ అని ఆమె అన్నారు. భాను కిరణ్ తనకు తెలియదని, సూరితో వాసుదేవ రెడ్డి తమ ఇంటికి వచ్చేవాడని ఆమె చెప్పారు. సూరి తరుచుగా తనతో మాట్లాడేవాడని, వార్తలు ఏమున్నాయని అప్పుడప్పుడు ఫోనులో అడిగేవాడని ఆమె చెప్పారు.తన వ్యవహారాల గురించి సూరి తనతో మాట్లాడేవాడు కాదని, తాను కూడా అడిగేదాన్నికానని ఆమె అన్నారు. భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే సూరిని మానవీయ కోణంలో తాను ఇంటర్వ్యూ చేసి ప్రెజెంట్ చేశానని, తమ ఎన్టీవి యాజమాన్యం అంగీకరించకపోతే తాను ఇంటర్వ్యూ చేసి ఉండేదాన్ని కాదని, అందులో సూరికి ఫేవర్ చేసే విషయమేదీ లేదని ఆమె అన్నారు. తన సోదరుడి మరణం గురించి సూరికి తెలుసునని, అయితే అవన్నీ మరిచిపోయి ప్రశాంతంగా జీవించాలని చెప్తుండేవాడని ఆమె అన్నారు. తానో హీరోను ప్రేమించినట్లు, అతన్ని సూరి ముఠాతో కొట్టించినట్లు వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించారు. మీడియా తనపై ఇష్టం వచ్చినట్లు రాస్తున్నాయని, అలా వార్తలు ఇచ్చిన మీడియాపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె అన్నారు.తనకు ఆత్మస్థయిర్యం ఉందని, పోరాటం చేస్తానని ఆమె చెప్పారు. భాను కిరణ్ గురించి సూరి తనతో ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు.

No comments:

Post a Comment